బయోపిక్లకు, రియల్ లైఫ్ సంఘటనలను తెరపైకి తీసుకురావడంలో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ది అందెవేసిన చెయ్యి. ఇలాంటి సినిమాల్లో ఆయన నటిస్తే వాటికో విలువ ఉంటుంది. ఇప్పుడు ఆయన నుంచి మరో ప్రతిష్ఠాత్మక బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈరోజు తన 52వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమాకు సంబంధించిన వివరాలను ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ ప్రకటించింది. 1178 నుంచి 1192 వరకు అజ్మేర్, దిల్లీ ప్రాంతాలను పాలించిన మహారాజు పృథ్వీరాజ్ చౌహాన్ బయోపిక్లో నటించనున్నారు. బాలీవుడ్లోనే అతిపెద్ద బయోపిక్గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు యశ్ రాజ్ సంస్థ ప్రకటించింది. ఇది తన కెరీర్లోనే అతిపెద్ద చిత్రమని అక్షయ్ ట్విటర్ వేదికగా వెల్లడిస్తూ సినిమాకు సంబంధించిన టీజర్ను విడుదల చేశారు. సినిమా గురించి అక్షయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘భారతదేశానికి చెందిన భయమెరుగని రాజుల్లో ఒకరైన పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రలో నేను నటిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. ఇలాంటి రియల్ హీరోల విజయాలను మనమంతా పండుగలా జరుపుకోవాలి. ఎన్నో తరాలకు పృథ్వీరాజ్ చౌహాన్ స్ఫూర్తి. నా పుట్టినరోజు నాడు ఈ సినిమాను ప్రకటించినందుకు మరింత సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు. ఈ సినిమాను చంద్రప్రకాశ్ ద్వివేదీ తెరకెక్కించనున్నారు. హిందీలో బుల్లి తెర ధారావాహికగా తెరకెక్కిన చాణక్యకు ద్వివేదీ దర్శకత్వం వహించారు. పృథ్వీరాజ్ చౌహాన్ బయోపిక్ వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోపక్క అక్షయ్ హౌస్ఫుల్ 4, సూర్యవంశీ, లక్ష్మీ బాంబ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఐదు పదుల వయసులోనూ అక్షయ్ చక్కటి ఫిజిక్తో ఈ తరం హీరోలకు గట్టి పోటీనిస్తు్న్నారు. ఏడాదికి నాలుగు, ఐదు సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ను గడగడలాడిస్తున్నారు. అందుకే ఆయన ప్రముఖ అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్లో అత్యధికంగా సంపాదిస్తున్న భారతీయ సెలబ్రిటీల్లో టాప్ స్థానం దక్కించుకున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2N2HVm0
No comments:
Post a Comment