శుక్రవారం వచ్చిందంటే థియేటర్స్ వద్ద సినిమా సందడి కనిపించేది. సెలబ్రిటీలు, క్రిటిక్స్ కోసం ప్రసాద్ ల్యాబ్స్, ఐమాక్స్ ఇతర థియేటర్స్లో స్పెషల్ షోలు నిర్వహిస్తుంటారు.. అయితే ఎవరు ఉన్నా లేకపోయినా ఏస్ పీఆర్వో, ప్రముఖ నిర్మాత మాత్రం అక్కడ కనిపిస్తుంటారు. సినిమా జర్నలిస్ట్లు అందర్నీ నవ్వుతూ పలకరించే బీఏ రాజు ఆకస్మిక మరణంతో ఇండస్ట్రీ మొత్తం షాక్కి గురైంది. "కృష్ణ గారి సినిమాలకు పని చేశాను.. ప్రస్తుతం మహేష్ సినిమాలకు వర్క్ చేస్తున్నాను.. రేపు గౌతమ్ కృష్ణ హీరోగా చేసే సినిమాలకు కూడా నేనే పి ఆర్ ఓ గా చేస్తాను’ అని అంటుండేవారు బి. ఏ.రాజు. అయితే ఆ కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచారు బీఏ రాజు. శుక్రవారం రాత్రి 07:56 గంటలకు హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో గుండెపోటుతో కన్నుమూశారు బీఏ రాజు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు కుమారులు అరుణ్ కుమార్, శివ కుమార్ ఉన్నారు. ఆయన సతీమణి ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు,కాలమిస్ట్ , దర్శకురాలు కలిదిండి జయ రెండు సంవత్సరాల క్రితం మరణించారు. కాగా బి ఏ రాజు మరణం పట్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. కాగా బీఏ రాజు ఆకస్మిక మరణంతో షాక్కి గురైన సూపర్ స్టార్ భావోద్వేగానికి గురయ్యారు. ట్విట్టర్ వేదికగా బీఏ రాజుతో ఉన్న అనుబంధాన్ని పంచుకుని సంతాపాన్ని ప్రటించారు. ‘బి.ఏ.రాజు గారు ఆకస్మిక మరణం ఊహించలేనిది. ఆయన మరణ వార్తని తట్టుకోలేకపోతున్నాం. చిన్నతనం నుంచీ ఆయన తెలుసు. మేము చాలా సంవత్సరాలు కలిసి ప్రయాణించాము.. నేను అతనితో చాలా దగ్గరగా పనిచేశాను. ఆయన పరిపూర్ణమైన ప్రొఫెషనల్.. సినిమా పట్ల అపారమైన మక్కువ కలిగిన పెద్దమనిషి. మా కుటుంబంతో ఆయనకు మంచి అనుబంధం ఉంది.. మా కుటుంబానికి, మీడియా సోదరభావానికి ఆయన మరణం పెద్ద లోటు. ఆయన మా కళ్ల ముందు నుంచే మాయమయ్యారు. రాజు గారు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అంటూ ఎమోషనల్ అయ్యారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక బీఏ రాజు సినీ ప్రస్థానం విషయానికి వస్తే.. సూపర్ స్టార్ కృష్ణ వద్ద పబ్లిసిటీ వ్యవహారాలు చూసే పి ఆర్ ఓ గా సినీ జీవితాన్ని ప్రారంభించిన బి. ఏ. రాజు ఆ తరువాత ఆయన ప్రోద్బలంతోనే ఫిల్మ్ జర్నలిస్ట్గా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఆంధ్రజ్యోతి, జ్యోతి చిత్ర, ఉదయం, శివరంజని వంటి దినవార పత్రికలలో సినీ పాత్రికేయుడుగా వివిధ హోదాలలో పని చేసిన పిమ్మట 1994లో తన భార్య జయ.బి (కలిదిండి జయ) సహచర్యంతో సూపర్ హిట్ పత్రికను ప్రారంభించి ఫిలిం జర్నలిజంలో ఎన్నో సంచలనాలు సృష్టించారు. బి ఏ రాజు కేవలం జర్నలిస్ట్గానే కాకుండా ఎందరెందరో అగ్రశ్రేణి సినీ నిర్మాతలకు, దర్శకులకు, హీరోలకు, హీరోయిన్స్ కు, సాంకేతిక నిపుణులకు పి.ఆర్. ఓ.గా పని చేసిన అనుభవం కూడా ఉంది. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తన నాలుగు దశాబ్దాల పాత్రికేయ ప్రస్థానంలో చిత్ర పరిశ్రమ మొత్తం అత్యంత ఆప్తుడిగా భావించే స్థాయికి ఎదిగారు. సినిమాల జయాపజయాల విషయంలో రాజు అంచనాలు విశ్లేషణ చాలా కచ్చితంగా ఉంటాయి అనే నమ్మకం పరిశ్రమ వర్గాల్లో ఉంది. చిత్ర పరిశ్రమలో పెద్దా చిన్నా ప్రతి ఒక్కరితో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరుచుకున్న రాజు నిర్మాతగా మారి తన సతీమణి జయ.బి దర్శకత్వంలో ప్రేమలో పావని కళ్యాణి, చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wvfpfv
No comments:
Post a Comment