సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె. వి ఆనంద్ క‌న్నుమూత‌

సినీ ఇండీస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఓ వైపు కరోనా మహమ్మారి దాడి, మరోవైపు అనారోగ్యంతో పలువురు సినీ ప్రముఖుల మరణాలు ఇండీస్ట్రీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవలే తమిళ హాస్యనటుడు వివేక్ మరణం తాలూకు విషాదం నుంచి పూర్తిగా తేరుకోకముందే కోలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె. వి ఆనంద్(54) గుండెపోటుతో కన్నుమూశారు. ఛాతిలో నొప్పి రావడంతో ఈ రోజు (ఏప్రిల్ 30) తెల్లవారుజామున చెన్నైలోకి ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆయన ఉదయం 3 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు. ఆయన మరణవార్తతో కోలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరణం పట్ల పలువురు సినీ నటులు, దర్శకనిర్మాతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలో పుట్టిన పెరిగిన కె.వి.ఆనంద్ ఫ్రీ లాన్స్ ఫొటో జ‌ర్న‌లిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. క‌ల్కి, ఇండియా టుడే దినప‌త్రిక‌ల్లో పని చేసిన ఆయన.. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ పీసీ శ్రీరామ్‌ వద్ద సినిమాటోగ్ర‌ఫీలో శిక్షణ పొందారు. ఆ తర్వాత ప్రేమ‌దేశం, ఒకేఒక్క‌డు, బాయ్స్, ర‌జినీకాంత్ శివాజీ లాంటి భారీ చిత్రాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా సేవలందించారు. క‌ణా కండేన్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారి సూర్య‌తో వీడొక్క‌డే(అయాన్‌)తో హిట్ కొట్టారు. రంగం(కో) సినిమాతో తెలుగులోనూ గుర్తింపు పొందారు. ఆ తర్వాత బ్ర‌ద‌ర్స్‌(మాట్రాన్‌), అనేకుడు(అనేగ‌న్‌), కవ‌న్‌, బందోబ‌స్త్‌(కాప్పాన్‌) చిత్రాల‌ను ఆయన రూపొందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3e0THtk

No comments:

Post a Comment